ఒక దేశం రెండు పేర్లు.."భారత్‌" అనే పేరు ఎలా వచ్చిందంటే.. | Sakshi
Sakshi News home page

Story Of Indias Original Name: ఒక దేశం రెండు పేర్లు.."భారత్‌" అనే పేరు ఎలా వచ్చిందంటే..

Published Wed, Sep 6 2023 4:28 PM

How India Got Its Name Bharat Story Of Indias Original Name - Sakshi

జీ20 డిన్నర్‌లో "ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌" అన్న పదం రేపిని చిచ్చు మామాలుగా లేదు. అటు రాజకీయ పరంగా ప్రతిపక్షాల మధ్య, సోషల్‌ మీడియా వేదికగా ప్రజల్లోనూ ఈ అంశం ఓ చర్చనీయాంశంగా మారింది. మన రాజ్యాంగం సైతం ఇండియా అంటే భారత్‌ అని అర్థం. అని చెబుతున్నా.. ఎందుకిలా చాలమంది ఇండియా అనే పేరు వద్దనుకుంటున్నారు. భారతదేశం అనే పదాన్నీ తమ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసేదిగా 'గర్వంగా ఫీల్వడానికి కారణం ఏంటీ? అసలు భారతదేశాని ఆ పేరు ఎలా వచ్చింది? మన పురాణాల్లో ముఖ్యంగా మన ఋగ్వేదం ఏం చెబుతుంది తదితరాల గురించే ఈ కథనం.

భారతదేశం అంటేనే వివిధ మతాల, సంస్కృతుల, ఆచారాల వారసత్వ కలయిక. ఒకరకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతికగా చెబుతుంటారు చరిత్రకారులు. వైవిధ్యాన్ని స్వీకరించే మహోన్నత దేశంగా కీర్తిస్తారు. ప్రాచీన కాలంలో మన దేశాన్ని సంస్కృతంలో "భారత్‌" లేదా "భరతఖండం" అని పిలిచేవారు. దీని గురించి మన చరిత్రకారులు వివరించి విభిన్న కథలు భారతదేశానికి భారత్‌ అనే పేరు ఎలా వచ్చిందో సవివరంగా చెబుతున్నాయి. అవేంటో చూద్దాం!. 

ఋగ్వేదం ప్రకారం...
ఋగ్వేదం భారత్‌ని ఏడు నదుల భూమిగా పేర్కొంది. ఋగ్వేదం 18వ శ్లోకం దశరాజ్ఞ లేదా పదిమంది రాజుల భయంకరమైన యుద్ధం కారణంగా "భారతదేశం" అనే పేరు వచ్చిందని చెబుతోంది. ఇంతకీ ఏంటా పదిమంది రాజుల యుద్ధం అంటే..తృత్స రాజవంశంలో భరత తెగకు చెందిన సుదాసు రాజుని పడగొట్టాలని సుమారు పదిమంది రాజులు పన్నాగం పన్నారు. ఫలితంగా పంజాబ్‌లోని రావి నదిపై సుదాసు, ఆ పదిమంది రాజుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదాసు రాజు విజయకేతనం ఎగురవేయడంతో .. సుదాసు రాజుకి అమితమైన ప్రజాధరణ లభించింది. ఇదే చివరికి ప్రజలు తమను తాము భరత తెగకు చెందినవారిగా గొప్పగా చెప్పుకునేలా చేసింది. "భరత" అనే పేరు ప్రజల్లో నోళ్లలో స్థిరంగా నిలిచిపోయింది. చివరికి భరత వర్ష అనే పేరుగా మారింది. అనగా..భరతభూమి అని అర్థం.

మహాభారతం ప్రకారం..
మహాభారతం ప్రకారం, భరత చక్రవర్తి అనే రాజు పేరు మీద భారతదేశాన్ని భరతవర్ష అని పిలుస్తారని అని మరో కథనం ఉంది. భరత రాజ వంశ స్థాపకుడు అయిన భరతుడు పాండవులు, కౌరవుల పూర్వీకుడు. హస్తినాపుర రాజు దుష్యంతుడు, శకుంతల కుమారుడు కూడా. భరతడు భారతదేశం మొత్తాన్ని జయించాడని అందువల్లే అతని పేరు మీదగా భరతవర్ష లేదా భరత భూమి అని పిలుస్తారని చెబుతారు. అలాగే విష్షుపురాణం ప్రకారం..భరతడుకి రాజ్యాన్ని అప్పగించి అతడి తండ్రి సన్యాసించేందుకు అడువులకు వెళ్లాడని అప్పటిని నుంచే భరతవర్ష అని పిలుస్తారని కూడా అంటారు. 

భారతదేశం అని ఎలా వచ్చిందో వివరించే పద్యం..

ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణాం
వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ॥

ఈ పద్యం భావం చూస్తే..ఉత్తరంగా సముద్రం, దక్షిణంగా హిమాలయాలు ఉన్న భూమిని భరత భూమి అని అక్కడ నివశించేవారు భరతడు వారసులని అర్థం. దీన్ని పరిశీలిస్తే భారతదేశం అనే పేరు ప్రాచీన గ్రంథాల నుంచి ఉద్భవించిందని క్లియర్‌గా తెలుస్తోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పూర్వం భారత సామ్రాజ్యం అంటే ప్రసుత పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్‌, రష్యా, తుర్క్‌మెనిస్తాన్, నార్త్-వెస్ట్ టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్‌లు కలిగి ఉన్న దేశం అని అర్థమట. ఇక భరత అనే పదం సంస్కృత పదం. దీని అర్థం అగ్ని. భర అనగా మోసుకెళ్లడం లేదా జ్ఞాన కోసం నిమగ్నమైన వ్యక్తి  అని అర్థం అంటే.. జ్ఞానాన్ని సముపార్జించే వాళ్లు అని అర్థం. 

జైన కథనం ప్రకారం..
మొదటి జైన తీర్థంకరడు పెద్ద కుమారుడు భరత చక్రవర్తి పేరు మీదగా భారతదేశం అని పిలుస్తారని మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. జైనమతం భారత దేశ నాగరికతకు మూలంగా కూడా చెబుతారు చరిత్రకారులు. 

భారతదేశానికి వివిధ పేర్లు వచ్చిన తీరు..
ఇక సింధు అనే సంస్కృత పదాన్ని ఆంగ్లంలో ఇండస్‌గా వ్యవహరించారు. సింధు పరివాహక ప్రాంతంలో నివశించేవారు కాబట్టి భారతీయులను ఇండియన్స్‌గా పిలవడం ప్రారంభించారు. అలా ఇండియా అని ఏర్పడింది. అలాగే వలసపాలకులు బ్రిటీష్‌ వారికి ఇలా పిలవడం సులభంగా అనిపించడంతో ఇండియా అనిపేరు స్థిరపడిందని అంటారు. ఇక పర్షియన్‌ పదం హిందూస్తాన్‌ అనే పేరుతో కూడా భారతదేశాన్ని పిలిచేవారు. దీని అర్థం హిందువుల భూమి, హైందవ దేశం అని అర్థం. మన దేశం అన్ని మతాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా ఓ గొప్ప మహోన్నత దేశంగా అలరారుతోంది.

(చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!)

Advertisement
Advertisement