Sakshi News home page

రెడ్‌లైట్‌ థెరఫీతో షుగర్‌ వ్యాధిని తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published Thu, Feb 22 2024 3:26 PM

Study Says Red Light Therapy Can Lower Blood Sugar Levels - Sakshi

చక్కెర వ్యాధి పేరు చెబితేనే అందరికి భయం వేస్తుంది. అదీగాక ఇటీవల కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని అదుపులో పెట్టుకోవడమే గానీ తగ్గడమనేది ఉండదు. అలాంటి చక్కెర వ్యాధిని జస్ట్‌ ఎరుపు రంగు కాంతితో అడ్డుకట్టవేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేగాదు చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. దీన్ని రెడ్‌ లైట్‌ థెరఫీ అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏంటీ థెరఫీ? ఎలా తగ్గించొచ్చు?..

శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో డయాబెటిస్‌ని  ‘రెడ్‌లైట్ థెరపీ’(ఎరుపు రంగు కాంతి)తో నియంత్రించొచ్చని వెల్లడయ్యింది. ఈ రెడ్ లైట్ స్టిమ్యులేటెడ్ ఎనర్జీ ప్రొడక్షన్‌లో నాన్-ఇన్వాసివ్, నాన్-ఫార్మాకోలాజికల్ అనే టెక్నిక్ గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని  నిరూపితమయ్యింది. ఈ పరిశోధనలో రెడ్‌లైట్‌ థెరపీ ద్వారా మైటోకాండ్రియాలో 670 నానోమీటర్ల ఉత్తేజిత శక్తి (స్టిమ్యులేటెడ్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేయగలిగినట్లు గుర్తించారు. అది గ్లూకోజ్ వినియోగానికి దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో ముఖ్యంగా గ్లూకోజ్ తీసుకున్న తర్వాత  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అనూహ్యంగా 27.7% తగ్గడమే కాకుండా  గ్లూకోజ్ స్పైకింగ్‌ను గరిష్టంగా 7.5%కి తగ్గించింది.

ఈ మైటోకాండ్రియా కీలకమైన సెల్యులార్ ప్రక్రియలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ గ్లూకోజ్‌ని ఉపయోగించి శక్తి అధికంగా ఉండే న్యూక్లియోసైడ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP)ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏటీపీ ఉత్పత్తిలో మెరుగుదల కారణంగా మైటోకాండ్రియా రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుందని చెప్పారు పరిశోధకులు. అందుకోసం సుమారు 30 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఒక 15 మందికి 670 nm రెడ్ లైట్ థెరఫీ ఇవ్వగా మిగిలిన వాళ్లకు ఈ థెరపీ ఇవ్వలేదు. వారందరి దగ్గర నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నోటి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ పరీక్షను తీసకున్నారు. అలాగే గ్లూకోజ్‌ ఇచ్చిన తర్వాత గ్లూకోజ్‌ స్థాయిలు ఎలా ఉన్నాయో కూడా పరీక్షించారు.

ఈ అధ్యయనంలో సుమారు 45 నిమిషాలు రెడ్‌లైట్‌ ఎక్స్‌పోజర్‌ని పొందిన వ్యక్తుల రక్తంలో గణనీయంగా గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గగా, మిగిలిన వారిలో చక్కెర నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ థెరఫీ తీసుకున్న వారిలో భోజనం తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన గ్లూకోజ్‌ స్పైక్‌లు కూడా తగ్గినట్లు గుర్తించారు. అలాగే మనం ఉపయోగించే ఈ ఎల్‌ఈడీ లైట్లలలో కూడా నీలం రంగే ఉంటుంది కానీ అస్సలు ఎరుపు రంగు ఉండదని అన్నారు. అందువల్ల మైటోకాండ్రియా ఏటీపీ ఉత్పత్తి ఫంక్షన్‌ని తగ్గిస్తోందని చెప్పారు.

ఇలా శరరీం ధర్మానికి విరుద్ధంగా పనిచేయడం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇది క్రమేణ దీర్ఘకాలిక మధుమేహనికి దోహదం చేసి బలహీననపరుస్తుందని అన్నారు. ఈ పరిశోధన కాంతి ప్రాముఖ్యతను తెలియజేసింది. అలాగే ఈ ఎరుపు రంగ కాంతిలో జస్ట్‌ 15 నిమిషాలు ఉంటే చాలు మంచి ఫలితాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన మొత్తం జర్నల్ ఆఫ్ బయోఫోటోనిక్స్‌లో ప్రచురితమయ్యింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఈడీ లైట్లు వినియోగం పెరగుతున్నందువల్ల త్వరితగతిన అందరూ ఈ ముప్పుని గుర్తించాలని అ‍న్నారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: వర్కౌట్‌లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్‌ టైమ్‌ లేదు!)

Advertisement
Advertisement