ఈదురుగాలుల బీభత్సం | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Published Sun, Mar 19 2023 1:24 AM

నకరికల్లు – మాచర్ల రహదారిలో లారీపై చెట్టు కూలిన దృశ్యం - Sakshi

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

నకరికల్లు: ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం సాయంత్రం ఈదురుగాలులలో కూడిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నకరికల్లు పరిధిలోని పలుచోట్ల 70కి పైగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక ఎస్టీకాలనీలో పదికి పైగా రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయాయి. పలుచోట్ల ఇళ్లపై చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. మొత్తం 30కి పైగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈదురుగాలి ధాటికి అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై కంటైనర్‌లారీ డివైడర్‌పై పడిపోయింది. నకరికల్లు– మాచర్ల రహదారిలో వైజంక్షన్‌ వద్ద భారీ వృక్షం పడింది. నర్శింగపాడు సమీపంలో కారుపై మరో వృక్షం పడింది. స్థానిక పీహెచ్‌సీ ప్రధానగేటుకు ఎదురుగా భారీ వృక్షం కూలడంతో బయటకు వచ్చేందుకు సిబ్బంది ఇక్కట్లు పడ్డారు. పొక్లెయిన్‌ సహాయంతో చెట్టును బయటకు తీసి సిబ్బందిని బయటకు రప్పించారు. మాచర్ల – నకరికల్లు రహదారికి అడ్డంగా భారీవృక్షం కూలడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అతికష్టం మీద రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. స్థానిక కస్తూర్బా పాఠశాలలోను చెట్లు విరిగిపడ్డాయి.

కూలిపోయిన కోళ్లఫారం

నకరికల్లులోని పిడుగురాళ్ల రహదారిలో నకరికల్లుకు చెందిన రావుకొండలు సుమారు రూ.25లక్షలు వెచ్చించి కోళ్లఫారం ఏర్పాటు చేసుకోగా ఈదురుగాలికి పూర్తిగా నేలకూలింది. స్థానిక పాతూరులో మస్తాన్‌వలి కోళ్లఫారం ఏర్పాటు చేసుకోగా పూర్తిగా నేలకూలింది. కోళ్లు చనిపోయాయి.

Advertisement
Advertisement