ఏఆర్ ఎస్ఐకు గాయాలు
తాడేపల్లి రూరల్: జాతీయ రహదారిపై కుంచనపల్లి వద్ద మంత్రి కాన్వాయ్లో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. సెక్యూరిటీ వాహనం ఎదురుగా వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఏఆర్ ఎస్ఐ గాయపడ్డాడు. వివరాలు.. మంగళగిరి వైపు నుంచి కార్మిక శాఖ మంత్రి ఎం.జయరామ్ తాడేపల్లి వైపు వస్తున్నారు. ఈ సమయంలో మంత్రి కాన్వాయ్లో ఉన్న పైలెట్ వాహనం ఎదురుగా వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్లో ఉన్న ఏఆర్ ఎస్ఐ కోటేశ్వరరావు గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వేరొక వాహనంలో మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
వైద్య విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేత
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్కు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతి దేవి క్రీడా పరికరాలను శనివారం సాయంత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొంత సమయం క్రీడలకు కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతోందని వెల్లడించారు. కళాశాల డెవలప్మెంట్ సొసైటీ ఫండ్(సీడీఎస్) ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ వినోద్కుమార్ అనుమతితో సుమారు రూ.3 లక్షలు ఖరీదు చేసే పరికరాలను ప్రిన్సిపాల్కు అందజేశారు. ఈసందర్భంగా వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, హాస్టల్ వార్డెన్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మంచికలపాటి సుబ్బారావు, డెప్యూటీ వార్డెన్, ఎస్పీఎం డిపార్టుమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విశ్రాంత పాత్రికేయుడు భాస్కరరావు మృతి
తెనాలి: విశ్రాంత పాత్రికేయుడు, ఫిల్మ్ ఎడిటర్ వీరంకి భాస్కరరావు(62) ఆకస్మిక మృతి చెందారు. కొత్తపేటలోని తన నివాసంలో నిద్రలోనే మృతి చెందారు. ఉదయం 9.20 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన స్నేహితుడు గమనించి బంధువులకు సమాచారం పంపారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్ సంభవించి ఉంటుందని పరీక్షించిన వైద్యుడు అభిప్రాయపడ్డారు. భాస్కరరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. బంధుమిత్రులు ఆయన భౌతికకాయాన్ని స్వస్థలమైన దుగ్గిరాల మండల గ్రామం మంచికలపూడి తరలించారు. అదే గ్రామంలో అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని సోదరుడు రాజా తెలిపారు.