● ప్రగతి, సంక్షేమం కొనసాగాలంటే ఆయనే మళ్లీ రావాలి ● నేటి నుంచి ‘ఏపీకి జగనే ఎందుకు కావాలంటే’ ప్రచార కార్యక్రమాలు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రాసాద్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఈనెల 9 గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే’ అనే ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా, ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, కిలారి రోశయ్య మాట్లాడారు. మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలోని సచివాలయాల వారీగా ‘ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే’ అనే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, పెన్షన్లు తదితర రంగాల్లో ఏపీని సీఎం వైఎస్ జగన్ ముందంజలో ఉంచారని ఉద్ఘాటించారు. పేద ప్రజలకు మరింత న్యాయం జరగాలంటే వైఎస్ జగన్తోనే సాధ్యమని చెప్పారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు ఇంకా న్యాయం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉంటుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని చెప్పారు.
2.50 లక్షల పరిశ్రమలు
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ ఏపీ నుంచి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గత టీడీపీ హయాంలో సుమారు 38 వేల పరిశ్రమలు వస్తే, సీఎం వైఎస్ జగన్ హయాంలో 2.50 లక్షల పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.
విప్లవాత్మక మార్పులు
పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఏపీలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ ఇతరత్రా రంగాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. దేశంలోనే ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూరిఫాతిమా, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అన్నాబత్తిని సదా, మక్కెన మల్లికార్జునరావు, జీఎంసీ ఉప మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజిల, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మాదా రాధాకష్ణమూర్తి, గనిక ఝాన్సీ, ముంతాజ్పఠాన్, జేసీఎస్ మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.