పెదకాకాని: విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచి ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల శ్రీ వేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మూడు రోజుల రాష్ట్రస్థాయి అండర్–17, అండర్–14 బాల బాలికల బేస్బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మద్య స్నేహసంబంధాలు పెంపొందుతాయన్నారు. గుంటూరు జోన్ రీజినల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. ఉత్తమ క్రీడాకారులకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అండర్–17, అండర్–14 విభాగాలలో బాల బాలికలు 500 మంది వెనిగండ్ల పాఠశాలకు చేరుకున్నారు. అలానే 50 మంది స్పోర్ట్స్ మేనేజర్లు, 50 వ్యాయామ ఉపాధ్యాయులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొండమడుగుల జ్యోతి, టోర్నమెంట్ పర్యవేక్షకులు హృదయ రాజు, జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ప్రతాపరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు శ్యామల వెంకటరెడ్డి, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వెనిగండ్ల చేరుకున్న
13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు