ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం
పట్నంబజారు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ నేతలకు బడుగు, బలహీన వర్గాలంటే తొలి నుంచి చిన్న చూపేనని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మండి పడ్డారు. గుజ్జనగుండ్లలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి వడ్డెరలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వడ్డెర జాతిని కించపరిచేలా పార్థసారథి వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డెర జాతి ప్రజలు నాటి కాలంలో వడ్డెర ఓబన్న మొదలుకొని నేటి వరకు వెన్నుచూపిన వీరులుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలో వడ్డెర కులస్తులపై చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఆక్షేపమన్నారు. టీడీపీ నేతలను వడ్డెరలపై ఉసిగొలుపుతున్న చంద్రబాబు కూడా వడ్డెర జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంకులా చూసిందని మండి పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో వారికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. నామినేటెడ్ పదవులు మొదలు, కేబినెట్ పదవుల వరకు బీసీలకు అందజేసి తాను బీసీల పక్షపాతినని సీఎం వై.ఎస్.జగన్ చాటి చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం బీసీ వర్గాలు సీఎం వై.ఎస్.జగన్కు అండగా నిలబడి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వడ్డెర జాతికి పార్థసారథి క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.