చేబ్రోలు: కంటి సమస్యలతో బాధపడేవారికి విముక్తి కల్పించి వారి భవిష్యత్తును వెలుగులతో నింపటమే లక్ష్యమని బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నేత్ర జ్యోతి వైద్యశిబిరం జరిగింది. వడ్లమూడి గ్రామ పరిధిలోని గరువుపాలెం, గౌడపాలెం ప్రాంతాల నుంచి వచ్చిన 917 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గుంటూరు టైకాన్ క్లినిక్స్ వారి సహకారంతో 105 మందికి ఫిజియోథెరపీ సేవలు అందించారు. బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సరంలో భాగంగా నేత్ర జ్యోతి ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని స్థానికులు, గ్రామ పెద్దలతో కలిసి అంబటి మురళీకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో బజరంగ్ నేత్ర జ్యోతి కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.
దివ్యాంగులకు బజరంగ్ ప్రోత్సాహం..
బజరంగ్ దివ్యాంగ దర్శిని సేవా కార్యక్రమం ద్వారా విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం నేత్రజ్యోతి వైద్య శిబిరంలో పలువురు దివ్యాంగులకు నేత్ర పరీక్షలు జరిపించిన అనంతరం, 8 మందికి జైపూరు కాళ్లను, చేతులను తయారు చేయించి అందిస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ వడ్లమూడిలో 917 మందికినేత్ర వైద్యపరీక్షలు