మాచవరం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తాళాలు పగలగొట్టి బంగారు నగలు చోరీ చేసిన ఘటన మాచవరం రచ్చబండ సెంటర్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుదె వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయాన్నే గుంటూరు ఆసుపత్రికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. పొలం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సుమారు 18 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయని గుర్తించారు.
విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ సురేంద్రబాబు, ఎస్ఐ సమీర్ బాషా పరిశీలించారు. క్లూస్ టీం ఇంటి పరిసరాలను, ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.