పాత గుంటూరు: ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్కు దక్షిణాదిన ఉన్న ఆరు రాష్ట్రాల విభాగానికి అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన ప్రముఖ టాక్స్ ప్రాక్టీషనర్ రామరాజు శ్రీనివాస్ ఎన్నికై నారు. కేరళలోని కొచ్చిన్లో శనివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి రాష్ట్రాలకు చెందిన 30 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రామరాజు శ్రీనివాస్కి గుంటూరుకు చెందిన పలువురు ప్రముఖులు, ఆడిటర్లు అభినందనలు తెలిపారు. జనవరి మొదటి వారంలో గుంటూరులో ప్రమాణ స్వీకారం ఉంటుందని రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
యువకుడిపై
హత్యాయత్నం కేసు నమోదు
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఓ యువతిపై యువకుడు బేడ్లు లాంటి పదునైన ఆయుధంతో దాడిచేసి గాయపరిచిన సంఘటనపై పోలీసులు ఆదివారం హత్యా యత్నం కేసు నమోదు చేశారు. వివరాలు.. విజయవాడ చిట్టినగర్లో నివాసముండే పోలాని కిరణ్కు కర్ణాటకకు చెందిన అనాథ అయిన వనపర్తి బుజ్జి పరిచయమైంది. ఆమెను విటుల వద్దకు పంపి వచ్చిన డబ్బులతో కిరణ్ జల్సాలు చేయడంతో పాటు చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరూ గొడవపడి స్టేషన్కు వెళ్లారు. అక్కడ కూడా బుజ్జిపై పదునైన ఆయుధంతో కిరణ్ దాడి చేసి పారిపోయాడు. అతనిపై హత్యా యత్నం కేసు నమోదు చేశామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొలం బావిలో మునిగి బాలుడి మృతి
నరసరావుపేట రూరల్: పంట పొలంలోని బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని జొన్నలగడ్డలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని జొన్నలగడ్డ ఎస్సీ కాలనీకి చెందిన కుందా రాంబాబు, మాధవి దంపతులకు యేసుబాబు(13), కోమలి ఇద్దరు సంతానం. మొదటి సంతానం అయిన యేసుబాబు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవురోజు కావడంతో ఇంటివద్దనే యేసుబాబు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని పొలంబావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో కాలు జారి అందులో పడి మునిగిపోయాడు. సమీపంలోని కాలనీవాసులు బావి వద్దకు వెళ్లిన సమయంలో చెప్పులు కనిపించడంతో గాలించగా యేసుబాబు మృతదేహం లభ్యమయింది.