బీఎల్వోలకు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశం
తెనాలి: ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని, అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలని తెనాలి సబ్కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గత రెండురోజులుగా తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో) సంబంధిత ఓటరు జాబితాతో సహా అందుబాటులో ఉన్నారు. ఓవరు ఎవరైనా తమ ఓటు జాబితాలో ఉందా? లేదా? అనేది పరిశీలించుకునేలా ఈ అవకాశాన్ని కల్పించారు. బీఎల్వోలు అందుబాటులో ఉన్నదీ? లేనిదీ పరిశీలించి, ప్రచార కార్యక్రమం సజావుగా జరిగేందుకు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. ప్రజలు వచ్చి ఓటరు జాబితాలో తమ పేరును చూసుకుంటున్నారా? లేదా? పరిశీలించారు. చనిపోయినవారి పేర్లు, డూప్లికేట్ పేర్లు జాబితాలో ఉంటే వాటిని తొలగించాలని, అందుకు తగిన ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం ఓటు నమోదు కోసం ఫారం–6 అర్జీలు 213, ఫారం–7 అర్జీలు 139, ఫారం–8 అర్జీలు 189 వచ్చాయి. గత రెండురోజుల్లో ఫారం–6 అర్జీలు 514, ఫారం–6ఏ అర్జీలు–01 , ఫారం–7 అర్జీలు 360, ఫారం–8 దరఖాస్తులు 369 వచ్చాయి. వీరితోపాటు సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన మండల తహశీల్దార్ కె.రవిబాబు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచారాన్ని పర్యవేక్షించారు.