పాల్గొంటున్న 28 పురుషులు, 18 మహిళల జట్లు
నరసరావుపేట రూరల్: క్రీడల ద్వారా ఆలోచన శక్తి పెరగడంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ అంతర కళాశాలల పురుషుల, మహిళల ఖోఖో పోటీలు ఆదివారం నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూఎన్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు, జేఎన్టీయూకే స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ జి.శ్యామ్కుమార్, జేఎన్టీయూఎన్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జీపీ రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ చూపే క్రీడాకారులకు ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని తెలిపారు. డాక్టర్ శ్యామ్కుమార్ మాట్లాడుతూ జేఎన్టీ అకడమిక్స్లోనే కాకుండా క్రీడల్లోను ప్రతిభ కనబర్చి అవార్డులు సాధిస్తుందని తెలిపారు. ఈ ఏడాది యూనివర్సిటీ క్యాంపస్లో రూ.9.5కోట్లతో సింథటిక్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ జీపీ రాజు మాట్లాడుతూ వర్సిటీ పరిధిలో ఈ అకడమిక్ ఇయర్లో నాలుగు ఈవెంట్లు నిర్వహించినట్టు తెలిపారు. పోటీలలో పురుషుల విభాగం నుంచి 28 జట్లు, మహిళల విభాగం నుంచి 18 జట్లు పాల్గొంటున్నాయి. 750మంది క్రీడాకారులు, 80 మంది ఫిజికల్ డైరెక్టర్లు హాజరయ్యారు. పోటీల అనంతరం సెంట్రల్ జోన్ పురుషుల, మహిళల జట్లను ఎంపికచేస్తారు. కళాశాల కార్యదర్శి, పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసకుమార్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు ఎల్.కృష్ణారెడ్డి, ఝాన్సీరాణి, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.