పరీక్షల జ్వరానికి చర్చా మాత్ర! | Sakshi
Sakshi News home page

పరీక్షల జ్వరానికి చర్చా మాత్ర!

Published Tue, Dec 26 2023 1:42 AM

పరీక్షా పే చర్చ బ్రోచర్‌ 
 - Sakshi

సత్తెనపల్లి: ప్రధానమంత్రి తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా .. అయితే ఆ అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్ష పే చర్చ’ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సి ఉంది. ఏటా పరీక్షలు ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ ఇప్పటికే 6వ ఎడిషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుకుంది. ఇప్పుడు 7వ ఎడిషన్‌ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రోత్సహించనున్నారు. విద్యార్థులకు పరీక్షల పై భయాన్ని తొలగించేందుకు ప్రధానంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో నమోదుకు

జనవరి 12 తుది గడువు ...

పరీక్షల సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి... ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి? వారి ఆకాంక్షలు ఏమిటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏమిటి? పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి? ఇలా పలు అంశాలపై ‘పరీక్షాపై చర్చ’ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు అర్హులు. ‘పరీక్షాపే చర్చ’ మొదటి ఎడిషన్‌ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ‘పరీక్షాపే చర్చ’లో పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్‌లైన్‌లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది.

విజేతలుగా నిలిస్తే...

‘పరీక్షాపే చర్చ’ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి విజేతకు కిట్‌, ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌, ఫొటోతో కూడిన డిజిటల్‌ సావనీర్‌ను పొందే అవకాశం ఉంది.

లాగిన్‌ అవ్వాలి ఇలా...

6 నుంచి 12 క్లాస్‌ విద్యార్థులకు

‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనే చాన్స్‌

ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా

మాట్లాడే అవకాశం

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకూ

కూడా అవకాశం

ఆన్‌లైన్‌లో నమోదుకు

జనవరి 12 తుది గడువు

u చర్చించే అంశాలు(విద్యార్థులకు)

మీ స్వాతంత్య్ర సమరయోధులను తెలుసుకోండి. మన సంస్కృతి మన గర్వం. నా పుస్తకం నా ప్రేరణ. భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడండి. నా జీవితం, నా ఆరోగ్యం. నా స్టార్టప్‌ కల. ఎస్‌టీఈఎం విద్యా/ హద్దులు లేని విద్య. పాఠశాలల్లో నేర్చుకోవడానికి బొమ్మలు, ఆటలు.

u ఉపాధ్యాయుల కోసం

మన వారసత్వం. అభ్యాస పర్యావరణాన్ని ప్రారంభించడం. నైపుణ్యం కోసం విద్య. తక్కువ కరిక్యులమ్‌ లోడ్‌, పరీక్షలకు భయంలేని వాతావరణం. భవిష్యత్‌ విద్యా సవాళ్లు.

u తల్లిదండ్రుల కోసం

నా బిడ్డ, నా గురువు. వయోజన విద్య– ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేయడం. కలిసి నేర్చుకోవడం, పెరగడం.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

‘పరీక్షాపే చర్చ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి.

–ఏఏ మధుకుమార్‌,

జిల్లా సైన్స్‌ అధికారి, పల్నాడు

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు htpps://innovateindia.mygov.in/ లింక్‌ను క్లిక్‌ చేసి, మొబైల్‌ నెంబర్‌ లేదా జీ మెయిల్‌ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్‌ అయి క్లిక్‌ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్‌ చేయాలి. విద్యార్థులు/ ఉపాధ్యాయులు/ తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకొని 1,500 అక్షరాల లోపు వివరించాలి. ‘పరీక్షాపే చర్చ’ కార్యక్రమం నిర్వహణకు జిల్లా స్థాయిలో సైన్‌న్స్‌ అధికారులు జిల్లా కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. ‘పరీక్షాపే చర్చ’లో ఎంపికై న సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లకు విద్యా మంత్రిత్వ శాఖ పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement