నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం | Sakshi
Sakshi News home page

నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం

Published Tue, Dec 26 2023 1:42 AM

కోటప్పకొండ ఆలయం  - Sakshi

నరసరావుపేటరూరల్‌: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఆరుద్రోత్సవానికి ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే తిరునాళ్ల తరువాత ఆలయంలో నిర్వహించే అతిపెద్ద కార్యక్రమం ఆరుద్రోత్సవం. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఆరుద్రోత్సవంలో పాల్గొంటారు. దీంతోపాటు కోటయ్య మాలధారులు కొండకు చేరుకుని మాలవిరమణ చేపడతారు. ఇందుకోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి స్వామి వారికి విశేష అభిషేకాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం రాత్రి నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మహారుద్రాభిషేకం

ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారికి మహారుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహించనున్నారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచాదార, సుగంధ ద్రవ్యాలు, విభూది, గంధం, కుంకుమ, తైలం, అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారికి విశేష అలంకరణలు చేయనున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభమయ్యే అభిషేకాలు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. ఆలయ యాగశాలలో బుధవారం ఉదయం 8 గంటలకు రుద్రహోమం జరుగనుంది.

మాలధారులకు ప్రత్యేక ఏర్పాట్లు

కోటయ్య మాల దీక్ష చేపట్టిన భక్తులు ఆరుద్రోత్సవం రోజున కోటప్పకొండకు చేరుకుంటారు. నరసరావుపేటతో చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి మాలధారులు కొండకు వస్తారు. లింగంగుంట్ల కాలనీ శివాలయం నుంచి భక్త బృందం కాలినడకన కొండకు చేరుకుని ఇరుముడులు స్వామివారికి సమర్పించి మాల విరమణ చేస్తారు. మాలధారుల కోసం ఆలయం వెనుక ఉన్న అభిషేక మండపంలో ఏర్పాట్లు చేశారు. అలాగే మాలధారులకు జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు.

భక్తులకు అన్నదానం

ఆరుద్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు అన్నప్రసాదాలు ఏర్పాటుచేశారు. పట్టణానికి చెందిన తాళ్ల వెంకటకోటిరెడ్డి, శీలం జయరామిరెడ్డి, అల్లు రమేష్‌లు ప్రతి ఏడాదీ భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. స్వామి వారి అభిషేకాలను భక్తులు అందరూ తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

త్రికోటేశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం

కోటయ్య మాలధారులకు జ్యోతిదర్శనం

తరలిరానున్న వేలాదిమంది భక్తులు

విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అభిషేకాలు తిలకించేందుకు ఏర్పాట్లు

స్వామి వారికి నిర్వహించే మహారుద్రాభిషేకం అభిషేకాలను దాతలతోపాటు భక్తులు అందరూ తిలకించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మాలధారులకు పాతకోటయ్య ఆలయం వద్ద నుంచి జ్యోతిదర్శనం కల్పిస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశాం. అలాగే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం.

–జి.శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ

Advertisement
Advertisement