గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖీగా చర్చలు జరుగుతాయని తెలిపారు. పీఎఫ్ భాగ స్వామ్య యజమానులందరు కార్యక్రమానికి విధి గా హాజరై, ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా ఉద్యోగులతో పాటు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అదే విధంగా నిధి ఆప్కే నికత్ కార్యక్రమానికి హాజరుకాగోరు వాటాదారులు, ఇతర శాఖల అధికారులు సూచనలు చేయవచ్చని తెలిపారు.
గుంటూరు కృష్ణనగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి, విజయవాడ కానూరులోని నారాయణ జూనియర్ కళాశాల, ప్రకాశం జిల్లా వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల, ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర హీంపట్నంలోని నిమ్రా ఇంజినీరింగ్ కళాశాల, రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయం, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రగతి పబ్లిక్ స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.