హన్మకొండ కల్చరల్: ప్రతిఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటే శారీరక, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చని, ఓరుగల్లు ప్రజలు యోగా శిక్షణలో పాల్గొనాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, హార్ట్ఫున్నెస్, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. హనుమకొండ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు యోగా గురువు, పద్మవిభూషన్ దాజి (కమలేష్ దేసాయి భాయ్ పటేల్)ను స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లోని కన్హా శాంతివనం తరహాలోనే ఓరుగల్లు సమీపంలో శాంతివనాన్ని నిర్మించడానికి తగిన ఏర్పాట్లను చేస్తామన్నారు. వినయ్భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారతదేశంలో యోగా పట్ల ఆసక్తిని కలిగించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. యోగా గురువు దాజీ మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆచరిస్తున్నారని, ధ్యానంతో మనసు ప్రశాంతత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, ప్రఖ్యాత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, సీపీ ఏవీ రంగనాథ్, కేయూ వీసీ ఆచార్య రమేష్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య, విద్యార్ధులు, అధికారులు పాల్గొని శిక్షణ నిపుణుల ద్వారా యోగా, ధ్యానం ఆచరించారు.
మంత్రి ఫోన్ పోయిందంటూ హైరానా
చిల్పూరు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు చెందిన ఫోన్ పోయిందని తెలపడంతో అధికారులు, పోలీసులు, నాయకులు కొద్ది సేపు హైరానా పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం చిల్పూరు మండల కేంద్రంలోని చిల్పూరుగుట్ట వద్ద చోటు చేసుకుంది. వివరిలాల ఉన్నాయి..వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణానికి హాజరైన మంత్రితో పాటు ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్ సంపత్రెడ్డిలు హాజరయ్యారు. స్వామివారి తలంబ్రాలు సమర్పించిన అనంతరం వెలుతున్న క్రమంలో తన మొబైల్ ఫోన్ కనిపించడం లేదని తెలపడంతో అందరు హైరానా పడ్డారు. మైకులో సైతం ప్రచారం చేశారు. కాసేపటికి చైర్మన్ శ్రీధర్రావు, అర్చకులు స్వామివారి మహిమతో ఫోన్ దొరికిందంటూ మైకులో తెలిపారు. ఇంతకీ ఆ ఫోన్ మంత్రి గారి కారులోనే ఉందనడంతో సంతోషపడ్డారు.
దినచర్యలో భాగం చేసుకోవాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఘనంగా ప్రారంభమైన యోగా మహోత్సవ్