– 8లోu
ఎంజీఎం : కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ జేఎన్–1 వైరస్ వ్యాపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఈ క్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి ప్లూ లక్షణాలతో బాధపడేవారికి జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పీహెచ్సీల వైద్యాధికారులకు సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశారు.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా..
ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బాఽధితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఒక వేళ వ్యాధి వ్యాప్తి జరిగినా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ మురళి తెలిపారు. ఆస్పత్రిలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్ పడకలు, 10 సాధారణ పడకలతో మొత్తం 50 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ వార్డుల్లో ప్రత్యేక వైద్యసిబ్బంది, వైద్యాధికారులు విధులు నిర్వర్తించనున్నట్లు డాక్టర్ మురళి పేర్కొన్నారు.
ఎలాంటి కేసులు నమోదు కాలేదు..
ఎంజీఎం ఆస్పత్రితోపాటు హనుమకొండ జిల్లా పరిధిలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం వద్దు :
డీఎంహెచ్ఓ సాంబశివరావు
జిల్లాలో ఉన్న 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో వచ్చే వారికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. ర్యాపిడ్ టెస్టులతోపాటు హనుమకొండ డిపో క్రాస్రోడ్డులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరోనా నిర్ధారణ శాంపిల్స్ సేకరిస్తున్నాం. కరోనాను ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలి. నిత్యం చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
ఎంజీఎంలో కరోనా వైద్యసేవల ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
న్యూస్రీల్
అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ
ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు
అందుబాటులో 10 వెంటిలేటర్లు,
30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలు
జాగ్రత్తలు తీసుకోవాలని
వైద్యుల సూచన