ఎంజీఎం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు, సమాజానికి మెరుగైన సేవలు అందించేలా చూడాలని సూచించారు. వైద్యుల రక్షణ పట్ల పోలీస్శాఖ నిత్యం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సీపీని కలిసిన వారిలో ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ ఎండీ అన్వర్, కార్యదర్శి బింగి శ్రీనివాస్, కోశాధికారి శ్రవణ్, ఉపాధ్యక్షులు వెంకటస్వామి, అజిత్ మహ్మమద్ తదతరులు పాల్గొన్నారు.
23న శ్రీమద్భగవద్గీత
శ్లోక పఠన పోటీలు
హన్మకొండ కల్చరల్ : టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వరంగల్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తున్నామని టీటీడీ డీపీపీ ప్రోగ్రాం ఆఫీసర్ రామిరెడ్డి కృష్ణమూర్తి మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు భగవద్గీత మూడో అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని ఒకటి నుంచి 30 శ్లోకాలను కంఠస్థం చేసి చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 6, 7 తరగతి విద్యార్థులను ఒక విభాగంగా, 8, 9 తరగతి విద్యార్థులను రెండో విభాగంగా అనుమతిస్తారని తెలిపారు. 18సంవత్సరాల లోపు, పైబడిన వయస్సు వారిని గ్రూపులుగా విభజించి సంపూర్ణ భగవద్గీత మీద పోటీలు నిర్వహిస్తున్నామని, వివరాల కోసం 94417 90725 సెల్ నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ప్రతి విభాగంలోనూ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు వారు తెలిపారు.
రాతికోట ఉత్తర ద్వారం
వద్ద మరమ్మతులు
ఖిలా వరంగల్: ఖిలావరంగల్లోని రాతికోట ఉత్తర ద్వారం వద్ద మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాతికోట శిథిలావస్థకు చేరడంతో అక్కడక్కడా కూలిపోతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టగా మంగళవారం కేంద్ర పురావస్తుశాఖ ఆధికారి మడిపెల్లి మల్లేశం పర్యవేక్షించారు. కాగా, ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలికంగా కాకుండా శాశ్వత పనులు చేపట్టాలని చరిత్రకారులు కోరుతున్నారు.
అడిషనల్ కలెక్టర్ను కలిసిన
ఎమ్మెల్యే నాయిని
కాజీపేట: హనుమకొండ కలెక్టరేట్లో మంగళవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తాను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఎమ్మెల్యేతోపాటు టీపీసీసీ కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు ఉన్నారు.
జెడ్పీ స్టాండింగ్ కమిటీ
సమావేశాలు
వరంగల్ : వరంగల్ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజును జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి శాలువాతో సత్కరించారు. అనంతరం 1, 7, 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాలు చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, 3వ స్థాయీసంఘం సమావేశం వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, 6వ స్థాయీసంఘం సమావేశం జెడ్పీటీసీ బానోత్ సింగిలాల్ అధ్యక్షతన నిర్వహించారు. సభ్యులు, అధికారులు పాల్గొని పథకాల పురోగతిపై చర్చించారు. 5వ స్థాయీ సంఘం సమావేశం వాయిదా వేసినట్లు జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తెలిపారు. సమావేశాల్లో జెడ్పీటీసీ సభ్యులు సిలువేరు మొగిలి, కోఆప్షన్ సభ్యులు ఎండీ.సర్వర్, గరిగె కల్పన, లావుడ్య సరోజన, మార్గం భిక్షపతి పాల్గొన్నారు.