వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు రావొద్దని కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ ‘కుడా’ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, బల్దియా ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి, నల్లా కనెక్షన్లు, సమస్యలు, ఆదాయం, చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బల్దియా ఇంజనీరింగ్ విభాగం, పబ్లిక్ హెల్త్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలు అరికట్టాలని కోరారు. బల్దియా వ్యాప్తంగా డబుల్ నల్లా కనెక్షన్లను ఏఈలు డివిజన్ల వారిగా గుర్తించాలన్నారు. ఇదే క్రమంలో రెవెన్యూ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం సమాయత్తం కావాలన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రస్తుతం చేపడుతున్న చర్యలకు అదనంగా ఇతర ఏర్పాట్లు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సలహాలు ఇవ్వాలన్నారు. త్వరలో మరోమారు సమావేశం ఉంటుందని తెలిపారు. ఈలోగా నీటి సరఫరా తీరుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ కన్సల్టెంట్ రవి, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, రాజయ్య ,శ్రీనివాస రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేసవి ప్రణాళికలు సిద్ధం చేయాలి
కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా