సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా జన్మతః అంగవైకల్యం పుట్టిన వారు, ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఉచితంగా రికంస్ట్రక్టివ్(ఆర్థోపెడిక్) శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు హైదరాబాద్లోని ఎన్టీపీసీ దక్షిణాది విభాగం ముందుకు వచ్చింది. నగరంలోని నర్సింగ్ స్వైన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆకార్ ఆశ ఆస్పత్రి, ఎన్టీపీసీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం జిల్లాలోని గుట్టుమల గ్రామంలో ఈ మేరకు బాధితులను గుర్తించేందుకు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. రూ.12.20 లక్షల వ్యయంతో 34 మంది బాధితులకు రికంస్ట్రక్టివ్ శస్త్రచికిత్సల కోసం ఆకార్ ఆశ ఆస్పత్రితో ఈ నెల 24న ఎన్టీపీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీపీసీ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ దెబాషిశ్ చటోపాధ్యాయ్ సమక్షంలో సంస్థ అధికారి బద్రుద్దీన్, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ భారతెందు స్వైన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎం సూర్యనారాయణ పాణిగ్రహి, సీనియర్ మేనేజర్ సహదేవ్ సేతి పాల్గొన్నారు.