సాక్షి, సిటీబ్యూరో : స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా జగ్జీవన్ రామ్ దేశానికి విశేష సేవలందించారని జలమండలి ఎండీ దానకిశోర్ కొనియాడారు. బుధవారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలు, కార్మికులకు హక్కులు కల్పించడంలో ఎంతో కృషి చేశారన్నారు.
కార్మికుల భద్రతలో ముందంజ
జలమండలి తమ కార్మికుల కోసం మంచి పనులు చేయడంలో, వారికి భద్రత కల్పించడంలో ఎప్పుడూ ముందుంటుందని ఎండీ దాన కిశోర్ వెల్లడించారు. మానవ రహిత పారిశుద్ధ్య పనులు చేపట్టిందని, మ్యాన్ హోళ్లలో దిగకుండానే పనులు చేపట్టేలా యంత్రాలతో శుభ్రం చేసే ప్రత్యేకంగా ఎయిర్ టెక్ మిషన్లను జలమండలి రూపొందించిందన్నారు. ఇది దేశంలోనే మొదటిసారి అని, దీనికి పీఎం కార్యాలయంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు అందుకున్నామన్నారు. కార్మికుల భద్రతను మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ఎల్బీ స్టేడియం వద్దనున్న జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నివాళులర్పించిన జీహెచ్ఎంసీ కమిషనర్
బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నివాళి
సాక్షి, సిటీబ్యూరో: బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న జలమండలి ఎండీ దాన కిశోర్