లష్కర్ సభకు భారీగా
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 8న సికింద్రాబాద్లో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో ఆరునెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో పార్టీ బలంగా ఉందనే సంకేతాలివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుమారు 11 వేల కోట్ల అభివృద్ధి పనులు, వందే భారత్, 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని.. ఈ సభ ద్వారా రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలోనే పేరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు సుమారు లక్ష మందిని తరలించాలని కమల నాయకత్వం నిర్ణయించింది. ప్రధానంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచే భారీగా జనసమీకరణ చేయాలని భావిస్తోంది. తద్వారా అధిష్టానానికి పార్టీ పటిష్టతను చాటి చెప్పడంతో పాటు కేడర్లో మరింత ఉత్సాహాన్ని నింపవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పోలీంగ్ బూత్ల వారీగా లక్ష్యాలను విధించింది. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి కనీసం వంద మందికి తగ్గకుండా వెంట తీసుకురావాలని ఆదేశించింది. దయం 10.30 గంటలకు ఆయా పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
లక్ష చదరపు అడుగుల్లో షెడ్లు
భారీ జన సమీకరణతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పార్టీ శ్రేణులు, అభిమానులు కూర్చొనేందుకు లక్ష చదరపు అడుగుల విసీ్త్రర్ణంలో ఇప్పటికే మూడు భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. అబిడ్స్, అంబర్పేట్, సనత్నగర్, సికింద్రాబాద్, మహేశ్వరం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, ఉప్పల్, నాంపల్లి, రాజేంద్రనగర్, కల్వకుర్తి, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు శివారులోని సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచీ పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. ప్రధానితో పాటు పార్టీ అధినాయకత్వం కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో వారి ముందు బలప్రదర్శన చేసేందుకు ఎవరికి వారు పోటీపడుతున్నారు. మరో మూడు రోజు ల్లో నగరానికి ప్రధాని రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆయా ఏర్పాట్లలో బిజీగా ఉంటే...పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు భగ్గున మండిపడుతున్నారు. పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
8న నగరానికి రానున్న ప్రధాని మోదీ
ప్రధాని బహిరంగ సభకు నగరమే టార్గెట్
బండి అరెస్ట్ నేపథ్యంలో పలువురి నేతల హౌస్ అరెస్ట్