చార్మినార్: పవిత్ర రంజాన్ మాసంలో పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం సాయంత్రం పాతబస్తీ ఖిల్వత్లోని చౌమహల్లా ప్యాలెస్లో నగర పోలీసుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య అతిథులకు స్వయంగా స్వాగతం పలికారు. హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలతో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్ భవనం వెనుక వైపు ఆహ్లాదకరమైన వాతావరణంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మంత్రి మహమూద్ అలీకి ఖర్జూరం తినిపించి రోజా విరమింపజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ..రంజాన్ మాసంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే మసీదుల వద్ద అదనపు బలగాలతో బందోబస్తు కొనసాగిస్తున్నామన్నారు. ఈద్–ఉల్–ఫితర్(రంజాన్)పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని కొనియాడారు.
చౌమహల్లా ప్యాలెస్లో సిటీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
హోం మంత్రి, డీజీపీ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరు