బంజారాహిల్స్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి..ఆమె గర్భందాల్చిన అనంతరం ముఖం చాటేయగా బాధిత బాలిక నెల 10వ తేదీన నవజాత మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడ్ని ఫిలింనగర్ పోలీసులు సోమవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ హరీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్లోని పద్మాలయా అంబేడ్కర్ నగర్ బస్తీకి చెందిన బాలిక (17)కు మహమూబ్నగర్కు చెందిన జేసీబీ డ్రైవర్ తుపాకుల బాలరాజ్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమె గర్భం దాల్చింది. నిందితుడు ముఖం చాటేశాడు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 8 నెలల గర్భంలోనే ఆ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం భయంతో ప్రసవించిన మరుక్షణమే ముక్కుపచ్చలారని మగశిశువును రోడ్డు పక్కన వదిలేసి ఇంట్లోకి వెళ్లింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా బాలిక ప్రసవించిన గుట్టు రట్టు అయింది. విచారణలో శిశువు జన్మకు కారకుడైన బాలరాజ్ వివరాలు బయటకి రావడంతో నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తల్లి, బిడ్డ ఆస్పత్రిలోనే..
కాగా బాలికకు జన్మించిన చిన్నారిని 108 అంబులెన్స్లో మెరుగైన చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నాడని, ఇంకా కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఇదిలా ఉండగా బాధిత బాలిక చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రిలో చేరింది. ఆమె బాగా నీరసంగా ఉందని చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.