హిమాయత్నగర్: వీసా కోసం పంపిన పాస్పోర్టులపైనే వీసా స్టాంప్ గుద్ది ఇవే మీ కెనడా పాస్పోర్టులంటూ నగరానికి చెందిన ముగ్గురికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. కనీస అవగాహన లేని వారు వాటినే వీసాలుగా భావించి ప్రయాణానికి సైతం సిద్ధపడ్డారు.అయితే వీసా పంపిన వ్యక్తుల మాటల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో అనుమానం వచ్చి ఆస్ట్రేలియా ఎంబసీనీ సంప్రదించగా ఫేక్ వీసాలని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మంగళవారం సిటీ సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. నగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన ముగ్గురు యువకులు కెనడాలో ఉద్యోగాలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ముందుగా విజిట్ వీసా కింద కెనడా వెళ్లి అక్కడ అన్నీ సమకూర్చుకున్నాక మరోసారి ఉద్యోగాల కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తక్కువ ఖర్చులో కెనడా వీసా ప్రాసెస్ చేసే వారిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యారు. ఒక్కొక్కరికీ రూ.3లక్షల చొప్పున ఖర్చు అవుతుందని, మొత్తంగా రూ.10లక్షలు ఇస్తే ప్యాకేజీ కింద విమానం టికెట్లు సైతం తామే ఇస్తామని నమ్మించారు. దీంతో వారు రూ.10లక్షలు చెల్లించడంతో వీసాలు ఇచ్చాడు. అయితే ఎయిర్ టికెట్లను రెండు పర్యాయాలు బుక్ చేసి క్యాన్సిల్ చేశాడు. ఇందులో ఏదో తిరకాసు ఉందని, తెలిసిన వారు చెప్పడంతో ఆస్ట్రేలియా ఎంబసీలో సంప్రదించారు. మీరు పంపిన పాస్పోర్టులపైన వీసా స్టాంప్ వేసి వీసాలంటూ ఇచ్చారని చెప్పడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని సైబర్క్రైంలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
కెనడా విజిట్ వీసా పేరుతో ముగ్గురికి టోకరా
రూ. 10 లక్షలు స్వాహా