బీజేపీ నుంచి..
● బీజేపీ సీనియర్ నాయకుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ముషీరాబాద్ టికెట్ను ఆశిస్తున్నారు. దత్తాత్రేయ నివాసం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉండటంతో అక్కడి నుంచి ఆమె పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే తరహాలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. భిక్షపతి యాదవ్ గతంలో కాంగ్రెస్లో ఉండగా అనంతరం బీజేపీలో చేరారు.
● కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ గోషామహల్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కాకుండా బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మేనమామ వివేక్ వెంకటస్వామి సహకారంతో ఆమె టికెట్ దక్కించుకోవచ్చని తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి..
ప్రస్తుతం మర్రి శశిధర్రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి తండ్రితో విభేదాల కారణంగా.. తండ్రిపైనే పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. పేదల నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి పి.జనార్దనరెడ్డి కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి తండ్రి వారసురాలిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. గత బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికై న ఆమె ఆపార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రజాగాయకుడు గద్దర్ తన పేరిట ‘గద్దర్ ప్రజాపార్టీ’ని ఏర్పాటు చేసినప్పటికీ, రాజకీయాల్లో పోటీ చేయకుండానే కనుమూసిన విషయం తెలిసిందే. గద్దర్ కుమార్తె వెన్నెలను కంటోన్మెంట్ నుంచి బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి..
కొద్దికాలం క్రితం మరణించిన బీఆర్ఎస్కు చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె లాస్య నందితకు పార్టీ టికెట్ ఇచ్చింది. తండ్రి వారసురాలిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక పర్యాయం జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా రాజకీయ అనుభవముంది.
గ్రేటర్ వెలుపల
కుమారుడికి టికెట్ కోసమే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే ఆయన కొడుకు గ్రేటర్ నుంచి కాకుండా మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగనున్నారు. ఇలా వివిధ కారణాలతో, పలువురు కొత్త తరం నేతలు ఈసారి అసెంబ్లీలో ప్రవేశించాలని ఆశిస్తున్నారు.