ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం గ్రేటర్ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం రాజ్భవన్ నుంచి నేరుగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి వచ్చిన ఆయన..గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి..అమ్మవారికి పండ్లు, పూలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం ప్రధాని మోదీ ప్రధాన గేటు బయటకు రాగానే భవనం పైనున్న ప్రజలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో వారికి ఎదురుగా కొద్ది క్షణాలు నిలబడి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ఇక మోదీ రాక నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మించిన ఘట్కేసర్–లింగంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ రైళ్లను సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే సనత్నగర్–మౌలాలి మధ్య రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టును, కొత్తగా నిర్మించిన మరో 6 ఎంఎంటీఎస్ స్టేషన్లను కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత పటాన్చెరులో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.