భారత ప్రభుత్వ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేము : రసెల్
Published
Thu, Mar 18 2021 3:08 PM
జమైకా: జమైకాకు కరోనా వైరస్ వ్యాక్సిన్లను పంపినందుకు విండీస్ ఆటగాడు ఆండ్రీ రసెల్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. "ప్రధాని మోదీకి, భారత హైకమిషనర్కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ చర్యతో మన రెండు దేశాల మధ్య బంధాలు మరింత బలపడ్డాయి" అంటూ రసెల్ బుధవారం ట్విటర్ వేదికగా వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, మార్చి 8న మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను భారత్ జమైకాకు పంపింది. దీంతో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. "భారత ప్రభుత్వం పంపిన 50000 డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను అందుకున్నట్లు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. కరోనా నివారణకు ఇంతటి సహాయం చేసిన భారత ప్రభుత్వానికి , ప్రజలకు మా దేశ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు.
'వ్యాక్సిన్ మైత్రి' పేరుతో ఇతర దేశాలకు వ్యాక్సిన్లు
కాగా, కోవిడ్ వ్యాక్సిన్లను కరేబియన్ దీవులకు పంపినందుకుగానూ గతవారం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడమ్స్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులోనూ ఇలాంటి స్నేహ సంబంధాలే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇంతటి సహాయం చేసిన భారత ప్రజలకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. జమైకా, బార్బడోస్, సెయింట్ లూషియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ తదితర దీవులు భారత్ నుంచి వ్యాక్సిన్ డోసులు అందుకున్నాయి.