24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి! | Sakshi
Sakshi News home page

24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి!

Published Wed, Jun 9 2021 8:01 AM

Bdelloid Rotifer Survives 24000 Years Frozen In Siberia Russia - Sakshi

మాస్కో: అవును నిజమే ఆ జీవులు 24 వేల సంవత్సరాల తర్వాత బతికాయి.. డెల్లాయిడ్‌ రోటిఫెర్స్‌ అనే సూక్ష్మజీవులు అప్పట్లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మంచు అడుగు భాగాల్లో సుప్తావస్త స్థితిలోకి జారుకున్నాయి. తాజాగా ఆ సూక్ష్మ జీవులు నిద్ర నుంచి మేలుకున్నాయి. 24 వేల ఏళ్ల తర్వాత సంతానం కూడా ఉత్పత్తి చేశాయి. రోటిఫెర్స్‌ మంచి నీటిలో జీవించే సూక్ష్మజీవులు. గడ్డ కట్టే స్థితి (ఘనీభవ స్థితి)లో దాదాపు పదేళ్లు జీవించి ఉంటాయని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు.

అయితే వీటి గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు రష్యాలోని సాయిల్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని సాయిల్‌ క్రయాలజీ లేబొరేటరీ పరిశోధకులు ముందడుగు వేశారు. ఈశాన్య సైబీరియాలోని అలజేయా నదికి సమీపంలో మంచు నమూనాలను తీసుకుని పరిశోధనలు చేశారు. ఈ మంచు అవక్షేపాల్లో డజన్ల కొద్దీ రోటిఫెర్స్‌ను వారు గుర్తించారు. ఈ సూక్ష్మ జీవులను లేబొరేటరీకి తీసుకొచ్చి వాటికి ప్రాణం పోశారు. వాటిలో కొన్ని జీవులు ‘పార్థో జెనెసిస్‌’అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వాటి సంతానానికి జన్మనిచ్చాయి. రేడియో కార్బన్‌ డేటింగ్‌ పద్ధతి, అవక్షేపాలు ఉన్న లోతును బట్టి ఇవి దాదాపు 24 వేల ఏళ్ల కిందటివిగా కనుగొన్నారు. ఆ సమయంలో సైబీరియాలోని మామ్మత్‌ జాతి ఏనుగులు సంచరిస్తూ ఉండేవని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త మాలావిన్‌ వివరించారు. 
చదవండి: మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!

Advertisement
Advertisement