పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు

Published Tue, Jan 30 2024 2:04 PM

Imran Khan Sentenced To 10Years In Jail  - Sakshi

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసు(సైఫర్)లో న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది.
 
సైఫర్ కేసు..
సైఫర్ కేసు అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. 

ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్‌ను నిర్బంధంలో ఉంచారు.  

ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ

Advertisement
Advertisement