2023లో భారత్‌- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి? | India China Relations In 2023, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Border Issue: 2023లో భారత్‌- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?

Published Sat, Dec 30 2023 7:57 AM

India China Relations In 2023 - Sakshi

భారత్‌లోని తూర్పు లడఖ్‌లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.

లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ  అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది.

చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా  రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. 

తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. 
సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి,  సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోంది.
ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!

Advertisement

తప్పక చదవండి

Advertisement