ఆయుష్షు మిగిలి ఉందంటే ఇదేనేమో. అమెరికాకు అల్లంత దూరంలో ఉండే హవాయి ద్వీపం సమీపంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఆయుష్షు అంటే ఏంటో తెలిసివచ్చింది. ఎందుకంటే, మృత్యుఘంటికల శబ్దం విని మరీ వెనక్కొచ్చాడు ఘనుడు.
స్కాట్ హరగుచ్చి అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో చాన్నాళ్లుగా చేపలు పడుతుంటాడు.
"అప్పుడే ఓ చేపను పట్టుకున్నాను. ఇంతలోనే ఓ భయానక శబ్దం వినిపించింది. ఎంతలా అంటే నా గుండె జారిపోయేంత. తిరిగి చూస్తే.. ఓ గోధుమ రంగు టైగర్ షార్క్ నా బోటుపై దాడి చేసింది. నేను ఇవతలివైపు ఉన్నాను కాబట్టి తృటిలో తప్పించుకోగలిగాను." - స్కాట్ హరగుచ్చి, కయాకర్, ఫిషర్ మన్
పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు పశ్చిమాన 3200 కిలోమీటర్ల దూరంలో ఉండే 137 దీవులను కలిపి హవాయి ఐలాండ్స్ అంటారు. దాదాపు 1200 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉండే ఈ దీవుల సమీపంలో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఈ నీటిలో ఇలాంటి సంఘటనలు అంతగా జరగవు. ఏడాది మొత్తమ్మీద నాలుగయిదు ఘటనలు కూడా ఉండవు. అయితే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చే టైగర్ షార్క్లు మాత్రం ఇలాంటి దాడులకు దిగుతాయి.
సాధారణంగా షార్క్లు బోటుపై దాడి చేయవు. అయితే స్కాట్ హరగుచ్చి దానికి కొద్దిసేపటి ముందు ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని వల నుంచి విడదీసే సమయంలో బ్లీడింగ్ జరిగింది. బహుశా రక్తం వాసనను పసిగట్టిన షార్క్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు.