విడాకుల కేసుల్లో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు
సాక్షి, చైన్నె : విడాకుల కేసులకు సంబంధించి సాగుతున్న జాప్యం కట్టడికి మధురై ధర్మాసనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొన్ని సూచనలు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం వేసవి కాల ప్రత్యేక బెంచ్ న్యాయమూర్తులు టిక్కారాం, బాలాజీ విడాకుల కేసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులను వాయిదాల పర్వంతో జాప్యం చేస్తున్నారని వివరించారు. ఈ దృష్ట్యా, కేసులు పెరిగి పోతున్నాయని పేర్కొన్నారు. ఈ కేసుల విచారణ జాప్యం కట్టడికి కొన్ని మార్గదర్శకాలు లేదా నిబంధనలు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం తప్పనిసరిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొన్ని అంశాలను సిఫారసు చేస్తూ విజ్ఞప్తి చేశారు. వడదెబ్బకు ముగ్గురి మృతి అన్నానగర్: రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాలలో వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. కోయంబత్తూరులోని కౌండంపాళయం మూవర్కు చెందిన మణికంఠన్ (45) గాంధీపురం ప్రాంతంలోని జెరాక్స్ దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కౌండంపాళయం నుంచి గాంధీపురానికి సైకిల్పై వచ్చిన ఆయన సాయిబాబా కాలనీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా స్పృహతప్పి రోడ్డుపై పడిపోవడంతో చుట్టుపక్కల వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మణికంఠన మృతి చెందినట్లు తెలిపారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లా వందవాసి పక్కనే ఉన్న చాలవేడు గ్రామం ముదలియార్ వీధికి చెందిన అరుముగం. ఇతని భార్య కనకవల్లి (80). వందవాసి బజార్ రోడ్డులో కూరగాయలు కొనేందుకు నడుచుకుంటూ వెళ్లింది. అప్పుడు వేడిమికి వృద్ధురాలు ఒక్కసారిగా స్ఫృహతప్పి పడిపోయింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ కనకవల్లి మృతి చెందింది. విల్లుపురం జిల్లా విక్రవాండికి చెందిన వేలు (41) సోమవారం పని ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో వేడి గాలి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
తిరుత్తణిలో వృద్ధుడు..తిరుత్తణి: తిరుత్తణి బస్టాండులో యాచకుడిగా ఉండే ఓ వృద్ధుడు మంగళవారం వడదెబ్బతో మరణించాడు. పోలీసుల దర్యాప్తులో మృతుడు రాణిపేట జిల్లా గురువరాజుపేటకు చెందిన ఎల్లప్పన్గా తెలిసింది. స్టిక్కర్ల వేటతో రూ. 6 లక్షల జరిమానా వసూలు సాక్షి, చైన్నె: ప్రెస్, పోలీసు, లాయర్, డాక్టర్ తదితర స్టికర్లతో చక్కర్లు కొడుతున్న వాహనాలను వేటాడే పనిలో గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈనెల 2వ తేదీ నుంచి చైన్నెలో వందకు పైగా మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు తిష్ట వేశారు. ప్రధానంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలలోని స్టిక్కర్లను తొలగించడమే కాకుండా, వాహన దారుల భరతం పట్టే విధంగా గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ పోలీసులు జరిమానాల మోత మోగించారు. ఐదు రోజులలో 1200లకు పైగా వాహన దారుల భరతం పట్టారు. స్టిక్కర్లను తొలగించడమే కాకుండా, రూ. 6 లక్షల మేరకు జరిమానా వసూలు చేశారు. మరోసారి ఇదే వాహనదారులు స్టిక్కర్లతో పట్టుబడితే రూ. 1000 లేదా రూ. 1500 జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అదేసమయంలో పోలీసుల తనిఖీలతో బెంబెలెత్తిన నకిలీ ప్రెస్ స్టిక్కర్లు వేసుకున్న వాహనదారులు ముందు జాగ్రత్తగా వాటిని స్వచ్ఛందంగా తొలగించడం గమనార్హం. డెంగీపై అవగాహన పళ్లిపట్టు: జనావాసాల్లో టైర్లు, నిరుపయోగ మైన వస్తువులు నిల్వ చేరకుండా చూసుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాల మేరకు ఆర్కేపేటలో మండల వైద్యధికారి తమిళసెల్వన్ ఆధ్వర్యంలో ఆరోగ్యసిబ్బంది, పంచాయతీ సిబ్బంది స్థానికులకు డెంగీ నివారణపై అవగాహన కల్పించారు.