పక్కకు ఒరిగిన ‘ఒడిస్సియస్‌’.. ఆసక్తికర విషయం వెల్లడించిన ‘నాసా’ | Sakshi
Sakshi News home page

చంద్రునిపై పక్కకు ఒరిగిన ‘ఒడిస్సియస్‌’.. అయినా పనితీరు ఓకే

Published Sat, Feb 24 2024 9:33 AM

Odysseus Tipped On Lunar Surface Revealed By Nasa - Sakshi

కాలిఫోర్నియా: జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్‌ ఒడిస్సియస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒడిస్సియస్‌ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకింది. దీంతో ల్యాండర్‌ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్‌(గోయి) మలాపెర్ట్‌ సమీపంలో ఒడిస్సియస్‌ గురువారం ఉదయం ల్యాండ్‌ అయింది.

ఇంట్యూటివ్‌ మెషీన్స్‌(ఐఎమ్‌) అనే ప్రైవేట్‌ స్పేస్‌ కంపెనీ, నాసా సంయుక్తంగా ఒడిస్సియస్‌ను ఎలాన్‌మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌లో చంద్రునిపైకి పంపాయి. ల్యాండ్‌ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్‌ పంపేందుకు ఒడిస్సియస్‌ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ సీఈవో స్టీవ్‌ ఆల్టిమస్‌ తెలిపారు.

ఒడిస్సియస్‌ ల్యాండ్‌ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్‌ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చాలా గోతులుండటం వారిని కొంత కంగారు పెడుతోంది. ఒడిస్సియస్‌ భూమి నీడలోకి వెళ్లేముందు వారం రోజుల పాటు పరిశోధనలు సాగించి డేటా పంపనుంది. 

ఇదీ చదవండి.. ఎక్స్‌ మెయిల్‌ వచ్చేస్తోంది 

Advertisement

తప్పక చదవండి

Advertisement