Morocco : 2000 దాటిన భూకంప మృతుల సంఖ్య | Sakshi
Sakshi News home page

Morocco Earthquake: భూకంప మృత్యు విలయం.. 2000 మంది మృతి

Published Sun, Sep 10 2023 7:43 AM

Over 2000 Killed In Morocco Earthquake - Sakshi

మర్రకేశ్‌: మొరాకోను భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి సంభవించిన భూప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలికిపడి వీదుల్లోకి పరుగులు తీశారు. వేలాది భవనాలు నేలమట్టం కాగా.. శిధిలాల్లో చిక్కుకుని 2000 మందికిపై పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ విపత్తులో 2,012 మంది ప్రాణాలు కోల్పోగా, 2,059 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు అన్నారు. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. ఘటనాస్థలాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.

  

భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్‌ హౌజ్‌ ప్రావిన్స్‌లోని ఇఘిల్‌ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది.

2004లో, ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో కనీసం 628 మంది మరణించారు. 926 మంది గాయపడ్డారు.1960లో అగాదిర్‌లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 12,000 మందికి పైగా ప్రాణాలను హరించింది.  

మొరాకో భూకంపంపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్‌ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్‌ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి.  

ఇదీ చదవండి: Morocco earthquake: వణికిన మొరాకో


 

Advertisement

తప్పక చదవండి

Advertisement