చైనా లక్ష్యంగా 4 దేశాల కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

చైనాయే లక్ష్యంగా క్వాడ్‌ దేశాల ప్రకటన

Published Wed, Oct 7 2020 8:05 AM

Quad Meet India USA Australia Japan Amid China Aggression Indo Pacific - Sakshi

టోక్యో/న్యూఢిల్లీ: డ్రాగన్‌ దేశం చైనా విస్తరణవాదంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేయాలని భారత్‌ సహా నాలుగు ‘క్వాడ్‌’(క్వాడ్రిలాటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) దేశాలు పునరుద్ఘాటించాయి. క్వాడ్‌ ‘నిజమైన భద్రతా చట్రం’ అని అమెరికా పేర్కొంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ, కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని భారత్‌ పేర్కొంది. జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతున్న ‘క్వాడ్‌’ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడారు.(చదవండి: భారత్‌- అమెరికాల మధ్య కీలక ఒప్పందం..)

ఈ సందర్భంగా.. ఇండో–పసిఫిక్‌ విధానానికి క్రమంగా మద్దతు పెరుగుతుండటం సంతృప్తికరమైన అంశమన్నారు. ఇక క్వాడ్‌ సమావేశాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నట్లు మైక్‌ పాంపియో చెప్పారు. ఈ సమావేశంలో ‘క్వాడ్‌’కూటమికి చెందిన ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులు మరిసె పేన్, తొషిమిత్సు మొటెగి పాల్గొన్నారు. క్వాడ్‌ వైఖరి మూడో దేశం ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని చైనా ఆరోపించింది. ఇతరులను వేరుగా ఉంచాలన్న విధానాలకు బదులుగా దేశాల మధ్య, ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సహకారం అవసరమని తెలిపింది.( చదవండి: చైనా మమ్మల్ని టార్గెట్‌ చేస్తుందేమో!?)

Advertisement
Advertisement