మహిళను కోట్లకు అధిపతి చేసిన ‘నత్త’ | Sakshi
Sakshi News home page

మహిళను కోట్లకు అధిపతి చేసిన ‘నత్త’

Published Sat, Mar 27 2021 10:36 AM

Thailand Woman Finds Orange Melo Pearl Worth Crores of Rupees - Sakshi

బ్యాంకాక్‌: అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. ఇందుకు ఉదాహరణలుగా నిలిచే సంఘటనల గురించి ఇప్పటికే చాలా సార్లు విన్నాం. తాజాగా ఇదే కోవకు చెందిన సంఘటన ఒకటి థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. కూర చేయడం కోసం తీసుకువచ్చిన నత్త ఓ మహిళ తల రాతను మార్చింది. కేవలం 160 రూపాయల ఖర్చుతో ప్రస్తుతం ఆమె కోటీశ్వరాలు కాబోతుంది. ఇదెలా సాధ్యమో తెలియాలాంటే ఇది చదవాల్సిందే. కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే థాయ్‌ మహిళ రెండు నెలల క్రితం రాత్రి భోజనం నిమిత్తం స్థానిక చేపల మార్కెట్‌ నుంచి నత్తలను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు 163 రూపాయలు. వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్‌ చేస్తుండగా.. ఓ నత్త కడుపులో ఆమెకు ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న రాయి లాంటి పదార్థం కనిపించింది. దాన్ని చేతులోకి తీసుకుని చూసి షాక్‌ అయ్యింది. దాన్ని తల్లికి చూపించింది. 

తల్లి చెప్పిన విషయం విని కొడ్చకార్న్‌ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇక తన దరిద్రం తీరిపోతుందని సంబరపడింది. ఇంతకు ఆమె చేతిలో ఉన్న ఆ పదార్థం ఏంటంటే ముత్యం. ఆరు గ్రాముల బరువుతో 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల ఆ ముత్యం అరుదైన మెలో జాతికి చెందినది. క్వాలిటీని బట్టి దాని ధర ఉంటుంది. ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుందని భావిస్తుంది. ఈ సందర్భంగా కొడ్చకార్న్‌ మాట్లాడుతూ.. ‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును మా అమ్మకు చూపించాను. ఆమె దాన్ని పరీక్షగా చూసి.. ఇది మెలో ముత్యం.. కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం దీ​న్ని కొనే వారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో మా అమ్మకు వైద్యం చేపించాలి. తను క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరం అవుతాయి’’ అని తెలిపింది. 


 

చదవండి: 
కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు
పెరట్లో ముత్యాల పంట!

Advertisement
Advertisement