అరుణాచల్‌ భారత్‌దే: అమెరికా | Sakshi
Sakshi News home page

చైనాకు ఎదురుదెబ్బ.. అరుణాచల్‌ భారత్‌లో భాగమే: అమెరికా

Published Thu, Mar 21 2024 9:40 AM

United States Recognizes Arunachal Pradesh As Indian Territory - Sakshi

వాషింగ్టన్‌: అరుణాచల్ ప్రదేశ్‌ అంశంలో డ్రాగన్‌ కంట్రీ చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాతమేనని అమెరికా పేర్కొంది. ఈ క్రమంలో చైనా ఆక్రమణను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. 

కాగా, ఈ అంశంపై యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మాట్లాడుతూ..‘అరుణాచల్ ప్రదేశ్‌ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తోంది. చొరబాట్లు లేదా ఆక్రమణలు, సైన్యం ద్వారా ప్రాదేశిక క్లెయిమ్‌లను ముందుకు తీసుకెళ్లే ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు’. ఇక, ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న వేళ అమెరికా.. భారత్‌కు మద్దతు ప్రకటించింది. 

ఇదిలా ఉండగా.. అరుణాచల్‌పై చైనా ఓవరాక్షన్‌ చేస్తోంది. దక్షిణ టిబెట్‌ (జాంగ్నాన్‌) తమ భూభాగంలోనిదేనని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్‌ కర్నల్‌ ఝాంగ్‌ షియాంగాంగ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అరుణాచల్‌ను చైనా ‘జాంగ్నాన్‌’గా పేర్కొంటోంది. ఇక, చైనా వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది.

ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ఓ ప్రకటనలో.. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్దం. ఈ వ్యవహారంలో నిరాధార వాదనలను పునరావృతం చేయడం ద్వారా.. అవి వాస్తవాలుగా మారిపోవు. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ మా దేశంలో అంతర్భాగం. మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు’ అని వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. చైనా- భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్బంగా కూడా చైనా అత్యుత్సాహం ప్రదర్శించింది. అది తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని చైనా ఓవరాక్షన్‌ చేసింది. ఇక, రెండు సందర్భాల్లోనూ భారత విదేశాంగ శాఖ చైనాకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది. 

Advertisement
Advertisement