Sakshi News home page

ఇరాన్‌ వర్సెస్‌ ఇజ్రాయెల్‌: ఇరాన్‌ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా

Published Mon, Apr 15 2024 9:23 AM

US Denies Iran says it gives warning before attacking Israel - Sakshi

ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్‌తో భీకరదాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ ఆదివారం భారీగా ఎత్తును డ్రోన్లు, మిసైల్స్‌తో విరుచుకుపడింది. అయితే  ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్‌ను 99 శాతం అడ్డుకున్నామని  ఇజ్రాయెల్‌ పేర్కొంది.

దాడి చేసే ముందు అమెరికాతో సహా ఇజ్రాయెల్‌ మిత్ర దేశాలకు తాము 72 గం‍టల ముందస్తు హెచ్చరిక నోటీసు ఇచ్చినట్లు ఇరాన్‌ పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడికి ముందే అమెరికాకు 72 గంటల హెచ్చరిక నోటీసు ఇచ్చామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా  తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌ నుంచి తమకు ఎలాంటి హెచ్చరిక నోటీసులు రాలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలో ఉన్నతధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో ముందస్తుగా ఇరాన్‌ తమను హెచ్చరించలేదని.. దాడిచేసిన  తర్వాతే తమకు ఇరాన్‌ సమాచారం అందించిదని అన్నారు. 

మరోవైపు ఇరాన్‌ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ దాడి చేయాలని వార్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ మరింత అప్రమత్తంగా ఉందని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ప్రమాదకర, రక్షణాత్మక చర్యల కోసం కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు.

ఇక.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఇరాన్  ఐక్యరాజ్యసమతి వేదికగా సమర్థించుకుంది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. దాదాపు  300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్‌పై అదను చూసి.. తగిన రీతిలో  ప్రతీకార దాడులకు  దిగుతామని ఇజ్రాయెల్‌ మంత్రి బిన్నీ గంట్జ్‌  తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement