Sakshi News home page

Hamish Harding: గల్లంతైన టైటాన్‌లో బ్రిటిష్‌ బిలియనీర్‌.. ఏవరీ హమీష్‌ హార్డింగ్‌?

Published Wed, Jun 21 2023 8:54 PM

Who is Hamish Harding UK billionaire On board missing Titanic Submarine - Sakshi

అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ శకలాల్ని చూడటానికి వెళ్లిన పర్యాటక జలంతర్గామి (Submarine)ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో అందులో ముగ్గురు టూరిస్ట్‌లతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. సబ్‌ మెర్సిబుల్‌ గల్లంతై మూడు రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అంట్లాంటిక్‌ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామిని గుర్తించేందుకు అమెరికా, కెనాడా కోస్ట్‌గార్డ్‌ దళాలు ముమ్మరంగా జల్లెడపడుతున్నాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న జలగర్భాల్లో ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను, పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు.

కాగా మిస్సైన జలంతర్గామి ‘టైటానిక్‌ సబ్‌మెర్సిబుల్‌’లో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్‌, అతడి కుమారుడు సులేమాన్‌, బ్రిటిష్‌ సంపన్నుడు, వ్యాపారవేత్త  హమీష్‌‌ హార్డింగ్‌, ఓషియన్‌ గేట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టాక్టన్‌ రష్‌, ఫ్రెంచ్ సబ్‌మెర్సిబుల్ పైలట్‌  పాల్‌ హెన్రీ నార్జిలెట్‌ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. 
చదవండి: టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్‌ ఫెయిల్యూర్‌..?

బ్రిటిష్‌ బిలియనీర్‌
అయితేబ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్‌ ఏవియేషన్స్‌ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్‌ బెజోస్‌ నిర్వహించిన బ్లూ ఆరిజిన్‌ వ్యోమనౌకలో  అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 

అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్‌’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు.

పాక్‌ సంపన్నులు
బ్రిటిష్‌-పాకిస్థానీ బిలియనీర్‌ షాజాదా దావూద్‌(48), ఆయన కుమారుడు సులేమాన్‌(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. ఈ మేరకు వారి కుటుంబం ధృవీకరించింది. షాజాదా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్‌ ఛైర్మన్‌. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 
చదవండి: Titanic Sub: ఆక్సిజన్‌ అయిపోతోంది.. టైటాన్‌ జాడేది?

 కాగా ఓషియన్‌ గేట్‌ అనే సంస్థ టైటానిక్‌ శకలాల సందర్శన యాత్రను నిర్వహిస్తోంది. ఇందుకు ‘టైటాన్‌’ పేరుతో 21 అడుగుల పొడవైన మినీ జలంతర్గామిని వాడుతోంది.  ఈ ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 

ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి ఈ సాహసయాత్ర ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే జలంతార్గామితో పోలార్‌ ప్రిన్స్‌కు సంబంధాలు ఎతగిపోయాయి. దీంతో టైటాన్‌ ఆచూకీ కనుగునేందుకు కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు.

ఇక విలాసవంతమైన టైటానిక్‌ షిప్‌ 1912 ఏప్రిల్‌ 14న అట్లాంటిక్‌ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. అక్కడి శిథిలాలను చూసేందుకు వెళ్తున్నప్పడే జలాంతర్గామి అదృశ్యమైంది. ఇక  జలాంతర్గామిలో కొద్ది గంటలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే ఉండటంతో సమయం గడుస్తున్నా కొద్దీ వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement