● వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతి నారాయణ్ భట్
జగిత్యాల అగ్రికల్చర్: పట్టు పురుగుల పెంపకంతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతి నారాయణ్ భట్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాలలో షెడ్యూల్డ్ కులాల రైతులకు సోమవారం మల్బరి సాగు, పట్టుపురుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో సంప్రదాయ పంటల ద్వారా ఆదాయం అంతంతమాత్రమే వస్తోందని తెలిపారు. అదనపు ఆదాయం కోసం పట్టు పురుగుల పెంపకం చేపట్టాలని సూచించారు. ఆసక్తి ఉన్న రైతులు బృందాలుగా వస్తే శిక్షణ ఇచ్చేందుకు వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు పట్టుపురుగుల పెంపకంపై దృష్టిపెడితే లాభాలుంటాయన్నారు. కార్యక్రమ కో–ఆర్డినేటర్, ప్రొఫెసర్ వి.రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.