'పుట్టిన రోజు'నాడే ఇలా జరగడంతో.. తీవ్ర విషాదం! | Sakshi
Sakshi News home page

'పుట్టిన రోజు'నాడే ఇలా జరగడంతో.. తీవ్ర విషాదం!

Published Sun, Oct 22 2023 12:12 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రుద్రంగికి చెందిన ఇట్టవేణి సతీశ్‌, రాజేశ్వరి దంపతుల కుమారుడు ఇట్టవేణి అయాన్‌(3) డెంగీతో శుక్రవారం రాత్రి మృతిచెందాడు. బాలుడి పుట్టిన రోజు శనివారం నాడే అంత్యక్రియలు నిర్వహించడంతో కాలనీ శోకసంద్రంలో మునిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. అయాన్‌ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వేములవాడలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యుడు రక్తకణాలు తగ్గాయని చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలించే క్రమంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.

మిన్నంటిన రోదనలు..
శుక్రవారం రాత్రి మృతిచెందిన అయాన్‌ది శనివారం పుట్టిన రోజు. ఆరోగ్యంగా ఉంటే పుట్టిన రోజు వేడుకలు ఎంతో సంబురంగా జరుపుకునేవాడు. డెంగీతో మృతిచెందడంతో పుట్టిన రోజు నాడే అంత్యక్రియలు నిర్వహించారు. పుట్టిన రోజునే నిన్ను పోగొట్టుకుంటున్నామా కొడుకా.. అంటు తల్లీదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

Advertisement
Advertisement