ధర్మపురి: గిరిజన బోదరగూడెంకు చెందిన అద్దరి చిన్నన్న(80) బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు సంతానం కలగకపోవడంతో మరొకరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్నన్న గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్నన్నకు అదే గ్రామానికి చెందిన కొందరితో గొడవలున్నాయి. గొడవల్లో చిన్నన్నకు అవమానం జరగగా.. అది భరించలేక ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
మెట్పల్లిరూరల్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మెట్పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆదివారం కోరుట్ల వైపు నుంచి లారీలో తరలిస్తున్న 260 క్వింటాళ్ల బియ్యం మారుతినగర్ వద్ద పట్టుబడిందన్నారు. వీటి విలువ సుమారు రూ.5.20 లక్షలుంటుందని అన్నారు. లారీ యజమాని కోరుట్లకు చెందిన అహ్మద్గా గుర్తించి అతడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
యువకుడి ఆత్మహత్య
మానకొండూర్: కొండపల్కలకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీరాముల మోహన్(33) తన నాయీబ్రాహ్మణ వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో చూపించుకొని, మందులు వాడుతున్నాడు. నొప్పి తగ్గడం లేదు. దీపావళి పండుగ సందర్భంగా అతని భార్య రజని ఖాజీపేటలోని తన తల్లిగారింటికి వెళ్లింది. మోహన్ ఇంటి ఆవరణలో గల మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు.