ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

Published Tue, Nov 21 2023 12:42 AM

రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు - Sakshi

చందుర్తి(వేములవాడ): చేతిలో డబ్బు లేకపోవడం.. చెల్లికి పెళ్లి చేయలేకపోవడంతో మనస్థానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం ఎన్గల్‌లో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్‌కు చెందిన గసికంటి ప్రమోద్‌(25) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పని సరిగ్గా లేక రెండేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలోనే కూలీ పనిచేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు(హమాలీ) పనిచేసి ఇంటికొచ్చాడు. తల్లి సత్తవ్వతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్ల వారుజామున తల్లి లేచి చూసే సరికి ప్రమోద్‌ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని కనిపించాడు. తల్లి రోదనలతో చుట్టుపక్కల వారు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది కనిపించాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాశాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి శంకర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్‌ తెలిపారు. మృతునికి తల్లి సత్తవ్వ, తండ్రి శంకర్‌, చెల్లె శ్రావణి ఉన్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి..

ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన సార్ల రాజేశం (55) కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది సోమవార ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రాజేశం చిన్నకుమారుడు ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి తిరిగి వచ్చాడు. ఈక్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో జీవితం విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

అప్పుల బాధతో రైతు..

వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలోని భూక్యతండాకు చెందిన రైతు భూక్య శంకర్‌(48) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. శంకర్‌ కొడుకు లింగమూర్తి అనారోగ్యంతో బాధపడుతుంటే చికిత్స కోసం దాదాపు రూ.10లక్షల వరకు అప్పుచేసి ఖర్చు పెట్టాడు. అప్పు తీర్చే మార్గం లేక మనస్థాపంతో తన పంట చేనులోకి చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య రేణ, పెళ్లయిన కుమార్తె సరోజ, కుమారుడు లింగమూర్తి ఉన్నారు.

సూసైడ్‌నోట్‌ రాసి ఉరివేసుకున్న యువకుడు

ఎన్గల్‌లో విషాదం

 ప్రమోద్‌ (ఫైల్‌)
1/1

ప్రమోద్‌ (ఫైల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement