సివిల్స్‌ ర్యాంకు ‘కొట్టే’శాడు! | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ర్యాంకు ‘కొట్టే’శాడు!

Published Wed, May 24 2023 3:44 AM

రిత్విక్‌ సాయికి మిఠాయి తినిపిస్తున్న 
తల్లిదండ్రులు కొట్టె మంజుల, రాధాకృష్ణారావు - Sakshi

మొదటి మూడు పర్యాయాలు ప్రిలిమ్స్‌ వరకే వెళ్లిన రిత్విక్‌.. నాలుగోసారి మెయిన్స్‌ వరకు చేరుకున్నారు. ఐదో ప్రయత్నంలో ప్రిలిమనరీ, మె యిన్స్‌తోపాటు ఇంటర్వ్యూకు చేరుకుని 558వ ర్యాంకు సాధించాడు. హనుమకొండ రాంనగర్‌కు చెందిన కొట్టె రాధాకృష్ణారావు, మంజుల దంపతులకు కుమారుడు రిత్విక్‌ సాయి, కుమార్తె రిషిక ఉన్నారు. రిత్విక్‌ సాయి తండ్రి రాధాకృష్ణారావు హసన్‌పర్తి భీమారంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో లైబ్రేరియన్‌. తల్లి మంజుల ఫ్యామిలీ కౌన్సిలర్‌. రిత్విక్‌ సాయి పాఠశాల విద్య హనుమకొండ బాలసముద్రంలోని గురుకుల్‌ పాఠశాలలో పూర్తి చేశారు. హైదరాబాద్‌ కొంపెల్లిలోని పేజ్‌ అకాడమీలో ఇంటర్మీడియట్‌ చదివారు. బీటెక్‌ ఈసీఈ ఢిల్లీ నోయిడాలోని శివనాడార్‌ యూనివర్సిటీలో అభ్యసించాడు. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత మల్టీ నేషనల్‌ కంపెనీలో నెలకు రూ.1.50 లక్షల జీతంతో ఉద్యోగం రాగా, సివిల్స్‌పై ఉన్న ఆసక్తితో ఉద్యోగంలో చేరలేదు.

ఐపీఎస్‌ ప్రథమ ప్రాధాన్యత : రిత్విక్‌ సాయి

ఐపీఎస్‌ నా ప్రథమ ప్రాధాన్యత. అయితే ఐఆర్‌ఎస్‌, ఐటీకి ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2017 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నా. సివిల్స్‌ ద్వారా ప్రజాసేవ చేయొచ్చని పట్టుదలతో చదివా. 2017 నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నా. నా పట్టుదలకు తోడు అదృష్టం కలిసి వచ్చింది.

ర్యాంకు రావడం సంతోషకంగా ఉంది :

రాధాకృష్ణారావు, మంజుల

మా కుమారుడికి సివిల్స్‌ 558వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. చిన్న నాటినుంచి ప్రజా సేవ చేయాలనే ఆసక్తి ఉండేది. సివిల్స్‌ ద్వారా అయితే మంచి అవకాశమని భావించి ఈ దిశగా కష్ట పడ్డాడు. ఐదేళ్లుగా పండుగలు, శుభకార్యాలకు దూరంగా ఉన్నాడు.

Advertisement
Advertisement