దేవరుప్పుల: ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజధానిలో ఉన్న స్థానికుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. దీంతో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగాయి. ఈ మేరకు ఆదివా రం ఇరు పార్టీలు ఎన్నికల కోడ్ వర్తించకుండా వివిధ కార్యక్రమాలతోపాటు ఆత్మీయ సమ్మేళనాల పేరిట సమావేశాలకు సన్నద్ధం అయ్యా యి. పాలకుర్తి నియోజకవర్గంలో 2,51,490 మంది ఓటర్లు ఉండగా.. తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల మండలాలకు చెందిన సుమారు 60 వేల మంది పైచిలుకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార తదితర రంగాల్లో జీవనోపాధి కోసం హైదరాబాద్లో జీవిస్తున్నారు. వీరందరనీ ఏకం చేసి ప్రత్యర్థుల కంటే మొదలు కమిట్మెంట్ చేసుకునేలా ఇరు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయా మండలాల పరిధి గ్రామాల వారీగా ముందస్తు ఓటర్ల జాబితా తయారు చేసి ప్రత్యేక టీంలుగా ఏర్పడి.. నేటి ఆత్మీయ సమ్మేళానికి తరలివచ్చేలా పావులు కదుపుతున్నారు. ఏది ఎమైనా నిత్యం స్థానికంగా ఉండే తమకంటే బయట జీవించే స్థానిక ఓటర్లకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన మర్యాదలు రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆదివారం హైదరాబాద్లోని నాగోల్, బోడుప్పల్, నాగారం తదితర ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాల లొకేషన్లను సోషల్ మీడియాల్లో బాహాటంగా వైరల్ చేయడం కొసమెరుపు.
స్థానిక ఓటర్లను మచ్చిక
చేసుకునేందుకు సన్నద్ధం
నేడు హైదరాబాద్లో బీఆర్ఎస్,
కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనాలు
సోషల్ మీడియాల్లో లొకేషన్లు వైరల్