జనగామ/పాలకుర్తి టౌన్/లింగాలఘణపురం/చిల్పురు: పున్నమి చంద్రుడి వెన్నెల కాంతులకు కార్తీక దీపాలు తోడు కావడంతో పుణ్య క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని సోమవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. శివాలయాల్లో తెల్లవారు జాము 4.30 గంటలకు విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చన లు నిర్వహించారు. మహిళలు ఉసిరి చెట్ల కింద 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. పట్టణంలోని గుండ్లగడ్డ ఉమామహేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జనగామ డీసీపీ సీతారాం దంపతులు, పాలకుర్తి నియోజవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.