– 8లోu
జనగామ: ములుగు జిల్లాలో ఈనెల 21, 22, 23, 24 తేదీల్లో నిర్వహించే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో జిల్లాలో మినీ జాతరలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పటి నుంచే అంతటా పండుగ వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ అధికా రులు, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గద్దెల ప్రాంగణాలకు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. జాతర పరిసరాలను చదునుచేసి భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లి, నర్మెట మండలం అమ్మాపూర్, తరిగొప్పుల మండలం బొత్తలపర్రె(బొంతగట్టు నాగారం) శివారు ఏడు పోషమ్మలు, చిల్పూరు మండల కేంద్రంతోపాటు లింగంపల్లి, గండిరామవరం శివారు పత్తేపూర్, స్టేషన్ఘన్పూర్ ఇప్పగూడెం, చింతగట్టు గ్రామాల్లో మూడు రోజుల పాటు మినీ జాతర వేడుకలు వైభవంగా జరగనున్నాయి.
పెరుగుతున్న ప్రాధాన్యం..
మేడారం మహాజాతరకు భక్తుల సంఖ్య ప్రతీ జాతరకు పెరుగుతూ వస్తోంది. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే వనదేవతల జాతరకు జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు నెల రోజుల ముందు నుంచే వెళ్లి ముందస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దూర భారం, ట్రాఫిక్ తదితర సమస్యల కారణంగా లోకల్ జాతరలకు ప్రాధాన్యత పెరుగు తూ వస్తోంది. జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో నిర్వహిస్తున్న మినీ జాతరల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మేడారం మహాజాతరకు ఆర్టీసీ జనగామ డిపో నుంచి 300 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్న యాజమాన్యం.. మినీ జాతరలకు సైతం ప్రత్యేక సర్వీసులు నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఊరంతా కలిసి..
బచ్చన్నపేట : మన్సాన్పల్లి అటవీ ప్రాంతంలో రెండేళ్ల కోసారి సమ్మక –సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలంతా కలిసి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఈసారి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తగినట్టుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ప్రభుత్వం వసతులు కల్పించాలి
గ్రామంలో నిర్వహిస్తున్న జాతర నేపథ్యంలో ప్రభుత్వం నిధులను మంజూరు చేసి భక్తులకు అవసరమైన వసతులు కల్పించాలి. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో అమ్మవార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
– గీస సందీప్, మన్సాన్పల్లి, బచ్చన్నపేట
నాలుగు గ్రామాల్లో..
చిల్పూరు: మండల పరిధి నాలుగు గ్రామాల్లో మినీ జాతరలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లింగంపల్లిలో 1992 నుంచి ప్రారంభమైన మినీ జాతర.. మేడారం తరువాత జిల్లాలో పెద్ద జాతరగా పేరుగాంచింది. ఈ జాతర నిర్వహణ 2016లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. శ్రీపతిపల్లి–కొండాపూర్ గ్రామాల సరిహద్దుల్లో మినీ జాతర 2002 సంవత్సరంలో ప్రారంభమైంది. చిల్పూరుగుట్ట–మబ్బుగుట్ట సమీపాన 2022 సంవత్సరం, ఫత్తేపూర్–గార్లగడ్డతండా జీపీల పరిధిలో 2010 సంవత్సరం మినీ జాతరలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక జాతర కమిటీలు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
20 నుంచి జాతర మొదలు
ఈ నెల 20వ తేదీ నుంచి మినీ మేడారం జాతర ప్రారంభవుతుంది. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
– లింగస్వామి, చిల్పూరు, జాతర కోయపూజారి
2006 సంవత్సరం నుంచి..
తరిగొప్పుల: బొంతగట్టు నాగారం, బొత్తలపర్రె శివారు ఏడు పోచమ్మల వద్ద 2006 సంవత్సరం నుంచి మినీ మేడారం జాతర నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో టెండర్లు నిర్వహించగా వచ్చిన ఆదాయంతో ఏర్పా ట్లు, సదుపాయాలు కల్పిస్తున్నారు. గత జాతర సమయంలో రూ.7లక్షల ప్రభుత్వ నిధులతో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు, విశ్రాంతి గది నిర్మించారు. తాగునీటి కోసం బోర్లు వేయించి మోటార్లు బిగించారు. ఈఏడాది రూ.8లక్షల మండల పరిషత్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. కాగా వేలం ద్వారా రూ.3 లక్షల నిధులు సమకూరాయి.
ప్రభుత్వం సహకరిస్తే మరింత అభివృద్ధి
మినీ మేడారం జాతర వేడుకలకు ప్రభుత్వం సహకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో భక్తులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం బెల్ట్ షాపుల నిర్వహణపై ఆంక్షలు విధించగా.. పెద్దతీర్థం దక్కించుకున్న వారు కమిటీకి డబ్బులు చెల్లించలేమని చెబుతున్నారు. జాతర ముగిసే వరకు వేలం దక్కించుకున్న వారికి వెసులుబాటు ఇవ్వాలి.
– కుర్రె మల్లయ్య, బొంతగట్టునాగారం, తరిగొప్పుల
2018 సంవత్సరం నుంచి..
నర్మెట: అమ్మాపూర్లో మేడారం మినీ జాతర 2018 సంవత్సరం ప్రారంభమైంది. నర్మెటతో పాటుగా తరిగొప్పుల, బచ్చన్నపేట, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గ్రామస్తులు విరాళాలను సేకరించి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు.
న్యూస్రీల్
ఐదు మండలాల్లో సమ్మక్క–సారలమ్మ జాతర
భక్తుల కోసం సదుపాయాల కల్పన
దేవాదాయ శాఖ అధికారులు,
ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం–రంగరాయిగూడెం, కోమటిగూడెం–అక్కపల్లిగూడెం గ్రామాల పరిధిలో శ్రీ చింతగట్టు సమ్మ క్క సారలమ్మ జాతర 2004 నుంచి ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమి టీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తాటికొండ–జిటేగూడం జీపీల పరిధిలో 2007 నుంచి మినీ జాతర నిర్వహిస్తున్నారు. ప్రస్తుత జాతర కమిటీ చైర్మన్ కోరుకొప్పుల మహేందర్, వైస్ ఎంపీపీ చల్ల సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రతీ జాతరకు వస్తాం..
తాటికొండలో జరిగే మినీ మేడారం జాతరకు ప్రతీ రెండేళ్ల కోసారి కుటుంబంతో కలిసి వస్తాం. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటాం. తల్లుల దీవెనలతో అనుకున్న పనులు జరుగుతున్నాయి.
– అక్కెనపల్లి వెంకటయ్య, భక్తుడు, తాటికొండ