సాక్షి ప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 13వ తేదీనుంచి సార్వత్రిక ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ప్రచార సభల షెడ్యూల్ను శనివారం రాత్రి పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న కేసీఆర్ 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రచారసభలు నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 28న వరంగల్లోనే ముగించనున్నారు. అక్టోబర్ 16న జనగామ నియోజకవర్గ కేంద్రంలో తొలి ప్రచార సభ నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మలి విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు ఉమ్మడి వరంగల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 13న నర్సంపేటలో, 14న పాలకుర్తిలో, 18 చేర్యాల(జనగామ)లో, 20న స్టేషన్ ఘన్పూర్, 21న డోర్నకల్, 24న ములుగు, భూపాలపల్లి, 28న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
రెండో రోజు ఒక నామినేషన్
భూపాలపల్లి అర్బన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో రెండవ రోజు ఒక నామినేషన్ దాఖలైంది. ఎంసీపీఐ(యూ) పార్టీ అభ్యర్థిగా అశ్రుఫ్ మహమ్మద్ శనివారం రిటర్నింగ్ అధికారి రమాదేవికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
కాంగ్రెస్లోకి రేగొండ ఎంపీపీ
భూపాలపల్లి అర్బన్: రేగొండ ఎంపీపీతో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రేగొండ ఎంపీపీ దంపతులు పున్నం లక్ష్మి, రవి, బీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజ్ సాంబమూర్తి, గణపురం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోట్ల నగేష్, చెల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, చిట్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కామిడి రత్నాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చాడ రఘునాథ్రెడ్డిలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు వివిధ పార్టీల ముఖ్య నాయకులు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకావాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆదేశించారు. భూపాలపల్లి పీహెచ్సీ పరిధిలోని జంగేడు హెల్త్ సబ్సెంటర్ను శనివారం డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీచేశారు. వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అఽధికారిణి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సంపత్, సిబ్బంది నవీన, శ్యాంప్రసాద్, ఆశాలు పాల్గొన్నారు.