న్యాయమూర్తులకు పదోన్నతులు, బదిలీలు | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులకు పదోన్నతులు, బదిలీలు

Published Fri, Nov 10 2023 5:22 AM

-

వరంగల్‌ లీగల్‌: రాష్ట్రవ్యాప్తంగా సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు కల్పిస్తూ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులకు అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతులు లభించగా.. మరో ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. ఒక న్యాయమూర్తిని పదోన్నతిపై హనుమకొండ ఫ్యామిలీ కోర్టుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి మండ వెంకటేశ్వరరావుకు అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి కల్పించి హైదరాబాద్‌ 16వ అడిషనల్‌ చీఫ్‌ జడ్జిగా బదిలీ చేశారు. హనుమకొండ సీనియర్‌ సివిల్‌ జడ్జి అప్పల నర్సింహామూర్తిని అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతిపై సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 17వ అడిషినల్‌ చీఫ్‌ జడ్జిగా నియమిస్తూ బదిలీ చేశారు. కామారెడ్డి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.శ్రీదేవి అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది, హనుమకొండ జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు) జడ్జిగా బదిలీపై రానున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఉన్న బి.అపర్ణను ఇక్కడే మొదటి అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జిగా ఉన్న టి.జయలక్ష్మిని రంగారెడ్డి జిల్లా 10వ జిల్లా అండ్‌ సెషన్స్‌ జడ్జిగా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు వారం రోజుల్లో తమకు కేటాయించిన స్థానాల్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement